తమ మేధో శక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజినీర్లదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఇంజనీర్లరందరికీ ముఖ్యమంత్రి ఇంజనీర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినమైన సెప్టెంబర్ 15ను పురస్కరించుకొని, ఆయన జ్ఞాపకార్థం ఇంజనీర్స్ డే గా జరుపుకోవడం జరుగుతుందన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరుగా, దార్శనికుడిగా, విద్యాప్రదాతగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా ప్రత్యేకతను చాటారన్నారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ సాంకేతికతతో వివిధ రంగాలలో ఆయన చేసిన కృషి భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి ఆదర్శంగా నిలిచాయని సిఎం చెప్పారు. మూసీ వరదల నుంచి హైదరాబాదు నగరాన్ని రక్షించేందుకు జల నియంత్రణ ప్రణాళికలు, ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టటంలో ప్రత్యేక చొరవ చూపించారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర,ఇంజనీరింగ్ విద్యార్ధులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు అందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్స్ తమ వంతు పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.