జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • అక్రిడిటేష‌న్ పాల‌సీపై యాక్షన్ ప్లాన్
  • జ‌ర్నలిస్టుల స‌మ‌స్యల‌పై మంత్రి పొంగులేటి సుదీర్ఘ స‌మీక్ష

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడిటేష‌న్ కార్డ్ లు అందేలా విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు డాక్టర్ బి.ఆర్‌. అంబేద్కర్ స‌చివాల‌యంలో హోమ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవి గుప్తా, ప్రెస్ అకాడ‌మీ ఛైర్మన్ కె.శ్రీ‌నివాస‌రెడ్డి, ఐ&పిఆర్ స్పెషల్ క‌మీష‌న‌ర్ సిహెచ్‌. ప్రియాంక‌, సీపీఆర్‌వో జి. మ‌ల్సూర్‌ తో క‌లిసి సమీక్ష నిర్వహించారు. ఈ స‌మావేశంలో ప్రధానంగా అక్రిడిటేష‌న్ పాల‌సీ, జ‌ర్నలిస్ట్‌ల హెల్త్ పాల‌సీ, జ‌ర్నలిస్టుల అవార్డులు, జ‌ర్నలిస్టుల‌పై దాడుల‌కు సంబంధించి హైప‌వ‌ర్ క‌మిటీ త‌ద‌త‌ర అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం హై పవర్ కమిటీని కూడా పునరుద్దరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జి.ఓ. జారీచేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు. అలాగే, జర్నలిస్టుల జీత భత్యాలకు సంబంధించి త్రైపాక్షిక కమిటీని కూడా పునరుద్దరిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీపై సమగ్రంగా చర్చించామని, ఇన్సూరెన్స్ పాలసీలో ఏది జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉంటుందో అనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అక్రిడిటేష‌న్ పాలసీపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను తక్షణమే రూపొందించాలని అధికారులకు సూచించారు. జర్నలిస్టులకు అవార్డులను పునరుద్దరించాలని ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి విజ్ఞప్తి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ సి.ఇ.ఓ. ఉదయ్ కుమార్, కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.