మే 3వ తేదీ వరకు రైల్వే ప్రయాణికుల సేవలు నిలిపివేత

భారతీయ రైల్వే  తన ప్రయాణికుల సేవలను మే 3వ తేదీ వరకు నిలిపివేసింది. మే 3వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అనుగూణంగా రైళ్లను నడిపే విషయం ప్రకటిస్తామని అధికారలు ప్రకటించారు. మామిడి, కూరగాయల, పువ్వులను రవాణా చేయడానికి అవకాశం కల్పించామని తెలిపారు. ఇందు కోసం ప్రతి రైల్వే జోన్‌కు ప్రత్యేకంగా అధికారులను నియమించామన్నారు. ఈ పార్శిల్‌ సర్వీస్‌ కరీంనగర్‌, ఖమ్మం, నల్లగొండ, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, హైదరాబాద్‌, సనత్‌నగర్‌ గూడ్స్‌ షెడ్‌ నుంచి రవాణా చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. రైతులు, ఎఫ్‌పీవోలు, ట్రేడర్‌లు వారి పండ్లు, కూరగాయలు రవాణాకి ఉపయోగించుకోవచ్చు. 

ఒక సరఫరాదారు కనీసం 23 టన్నుల సరుకు రవాణా పార్శిల్‌ వ్యాగన్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సరుకు ఎక్కించుకోవడం, సంబంధిత ప్రాంతంలో దించుకోవడం, మార్కెట్లకు పంపుకోవడం స్వయంగా సరఫరాదారుడే చూసుకోవాల్సి ఉంటుంది. మామడి, బత్తాయి పండ్లను 20, 25 కిలోల ట్రేలలో ప్యాకింగ్‌ చేసి లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సరుకు రవాణా చేసే రెండు రోజుల ముందు సంబంధిత రైల్వే స్టేషన్‌లో దరఖాస్తు చేసుకుంటే వ్యాగన్‌ను ఏర్పాటు చేస్తారు. సరుకు ఢిల్లీ పంపడానికి 24 గంటల సమయం పడుతుంది. 23 టన్నుల పార్శిల్‌ వ్యాను ఢిల్లీ పంపుటకు హైదరాబాద్‌ నుంచి 1 లక్ష 20 వేల రూపాయలు చార్జ్‌ చేస్తున్నారు. ఇతర స్టేషన్‌ల నుంచి పంపడానికి 1 లక్ష 25 వేలు ఛార్జ్‌ చేస్తున్నారు. కలకత్తా, ముంబై, నాగాపూర్‌, చెన్నైలకు కూడా సర్వీసులు నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే 9701370952, [email protected] నకు సంప్రదించాలని కోరారు.