దేశ వ్యాప్తంగా రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితా విడుదల

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్ల జాబితాను ప్రకటించింది. దేశంలో 170 జిల్లాలు రెడ్‌జోన్‌లు, 207 జిల్లాలను ఆరెంజ్‌ జోన్లగా గుర్తించింది. 14 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌కు, అలాగే 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే ఆరెంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌కు మార్చుతామని కేంద్రం పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 11 జిల్లాలను రెడ్‌జోన్‌ జాబితాలో చేర్చింది. ఆ జాబితాలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, వైఎస్‌ఆర్‌  కడప,  తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖ, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.

ఇక తెలంగాణలో ఎనిమిది జిల్లాలను రెడ్‌జోన్‌ జాబితాలో చేర్చింది. వాటిలో హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మేడ్చల్‌, కరీంనగర్‌, నిర్మల్‌ జిల్లాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో హాట్‌స్పాట్‌ క్లస్టర్‌గా నల్లగొండ జిల్లాను కేంద్రం గుర్తించింది. మరో 19 జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌ జిల్లాల జాబితాలో చేర్చింది. వాటిలో సూర్యాపేట, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, వికారాబాద్‌ సంగారెడ్డి, మెదక్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జనగాం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, ములుగు, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలు ఉన్నాయి.