ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్లో ఉన్నట్టు తెలిపింది. వెంకయ్యనాయుడి వయసు 71 ఏండ్లు. సాధారణ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టు చేయటంతో పాజిటివ్ అని తేలిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. వెంకయ్యనాయుడు సతీమణి ఉషకు వైరస్ సోకలేదని, ఆమె స్వీయ ఏకాంతంలో ఉన్నారని పేర్కొంది. ఈ నెల 24తో ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రాజ్యసభ చైర్మన్ హోదాలో వెంకయ్యనాయుడు హాజరయ్యారు. దాంతో సభలో ఉన్నవారిలో ఇంకెవరికైనా వైరస్ సోకిందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
