బాబ్రీ తీర్పును మ‌నస్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నా : ఎల్‌కే అద్వానీ

 బాబ్రీ మ‌సీదు కేసులో నిందితుల‌పై మోపిన‌ అభియోగాల‌ను ల‌క్నోలోని సీబీఐ ప్ర‌త్యేక కోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఎల్‌కే అద్వానీ స‌హా 32 మందిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ క్ర‌మంలో ఎల్‌కే అద్వానీ స్పందించారు. బాబ్రీ మ‌సీదు కేసులో సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మ‌న‌స్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ తీర్పు రామ‌జ‌న్మభూమి ఉద్య‌మం ప‌ట్ల త‌న నిబ‌ద్ద‌త‌తో పాటు బీజేపీ చిత్త‌శుద్ధిని తెలియ‌జేస్తుంద‌ని అద్వానీ పేర్కొన్నారు. ఈ కేసులో అద్వానీ నిర్దోషిగా ప్ర‌క‌టించ‌బ‌డ‌టంతో ఆయ‌న నివాసానికి ప‌లువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయ‌కులు వెళ్లారు. ఇక ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.