పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలి : డీజీపీ మహేందర్‌రెడ్డి

రానున్న మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు పోలీస్‌శాఖను ఆయన అప్రమత్తం చేశారు. పోలీసులంతా 24గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. జిల్లా కలెక్టర్లు, విపత్తుల నిర్వహణశాఖతోపాటు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. డయల్ 100కు వచ్చే ప్రతి ఫోన్‌కు సిబ్బంది తక్షణం స్పందించాలన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే 100కు ఫోన్ చేయాలని డీజీపీ ప్రజలను కోరారు.