ఈ నెల 29న 12:30 గంటలకు ధరణి ప్రారంభం

‘ధరణి’ ప్రారంభానికి  ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న (గురువారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ‘ధరణి’ పోర్టల్‌ ప్రారంభం కానున్నది. దసరా సందర్భంగా ఈ నెల 25నే పోర్టల్‌ను లాంచ్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ భావించారు. కానీ, ముహూర్తబలం సరిగా లేదన్న సూచనలతో వాయిదా వేశారు. ఈ నెల 29న పోర్టల్‌ ప్రారంభించగానే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఫలితంగా ఒకే రోజులో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తయి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. అటు.. ధరణి ట్రయల్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ బాధ్యతలను తాసిల్దార్‌కు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ బాధ్యతను సబ్‌రిజిస్ట్రార్లకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాసిల్దార్లు ఈ నెల 18  నుంచే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియపై సాధన చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కో తాసిల్దార్‌ సగటున 20కిపైగా ట్రయల్స్‌ నిర్వహించారు. కొన్నిచోట్ల 30-40 నమూనా లావాదేవీలు జరిగినట్టు సమాచారం. ఈ ట్రయల్స్‌ ఇంకా కొనసాగుతున్నాయి.