మున్సిపల్ కమిషనర్ సురేందర్ లాకర్‌లో భారీగా నగదు, బంగారం

ఇటీవల ఏసీబీకి పట్టుబడిన మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వడ్డె సురేందర్‌ భార్య బ్యాంకు లాకర్‌లో భారీగా ఉన్న బంగారు, నగదు సీజ్‌ చేసినట్లు మహబూబ్‌నగర్‌ ఏసీబీ రేంజ్‌ డీఎస్పీ కృష్ణగౌడ్‌ బుధవారం తెలిపారు. డీఎస్పీ కథనం మేరకు వివరాలు..మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న  క్రమంలో ఓ కాంట్రాక్టర్‌ వద్ద రూ.లక్షా65వేలు నగదు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కమిషనర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి అతని కుటుంబ సభ్యుల వివరాలు బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేశారు.

ఈ క్రమంలో కమిషనర్‌ భార్య బ్యాంకు వివరాలు ఆరాతీశారు. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉన్న ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు ఖాతాను తనిఖీ చేయగా భార్య  పేరిట రూ.27 లక్షల 44వేల నగదు, లాకర్‌లో 808 గ్రాములు బంగారం ఆభరణాలు, 71గ్రాములు వెండి వస్తువులు లభ్యమవడంతో వాటిని సీజ్‌ చేశారు. బంగారం విలువ రూ.17లక్షల26వేలు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.