దుబ్బాక ఉప ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండగా తాజాగా.. బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమాజీ గూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గత 11 సంవత్సరాలుగా బీజేపీలో ఉంటూ పార్టీకి సేవ చేశానన్నారు. ఒక ప్రైవేట్ బ్యాంక్లో మంచి స్థానంలో ఉన్న నేను తెలంగాణ కోసం ఉద్యోగం వదిలి బీజేపీలో చేరినట్లు తెలిపారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా కూడా ప్రజల్లోనే ఉన్నానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతుందని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంతో తెలంగాణకు న్యాయం జరగదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ పురోగమిస్తుందని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు.
కేంద్రం ఏదైనా బిల్లు తెస్తే పార్టీలో కనీస చర్చ కూడా చేయలేదని ఆవేదన వెలిబుచ్చారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీ ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తుందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. టీఆర్ఎస్లో చేరి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తానని ప్రకటించారు. నాతో పాటు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నేతలు కలిసి వస్తున్నారు. వేయి మంది బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారు. వాళ్లంతా టీఆర్ఎస్లో చేరుతారని ఆయన వివరాలను వెల్లడించారు.