నేల పచ్చగుండాలి – మనిషి చల్లగా బతకాలనే సదాశయంతోనే “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” : జగపతిబాబు

నేల పచ్చగుండాలి – మనిషి చల్లగా బతకాలనే సదాశయంతో మొదలైన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు అపూర్వ స్పందన లభిస్తుంది. ఎవరికి వారుగా మొక్కలు నాటుతూ తమ స్నేహితులు, బంధువులకు ఛాలెంజ్ విసురుతూ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను ముందుకు తీసుకుపోతున్నారు.  ఇందులో భాగంగానే యంగ్ హీరో నాగశౌర్య ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన కుటుంబ చిత్రాల కథానాయకుడు జగపతిబాబు నేడు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి కూకట్‌ప‌ల్లిలోని తన నివాసం లోథా అపార్ట్‌మెంట్స్‌లో మొక్కలు నాటారు. అనంతరం జగపతిబాబు మాట్లాడుతూ..

సమాజం పట్ల బాధ్యతతో, ప్రేమతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు శ్రీ‌కారం చుట్టిన జోగినిపల్లి సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇది మన అందరి కార్యక్రమం. అందరం కలిసి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ను ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే భవిష్యత్ తరాలకు మనం అందించే కానుక అని తెలిపారు. అందుకే ఈ కార్యక్రమంలో ఒక్కరో ఇద్దరో ముగ్గురో కాకుండా త‌న‌ అభిమానులు, శ్రేయోభిలాషులందరు స్వచ్ఛందంగా పాల్గొని “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”ను మరింత ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు.