తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1470 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. టీ-20 మ్యాచ్లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా.. అనుహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ 11 నుంచి 20 రౌండ్ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది.
ఓ సమయంలో టీఆర్ఎస్ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. అయితే పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్లో బీజేపీ లీడ్లోకి వచ్చి.. ఉత్కంఠకు తెరదించింది. వరుసగా 20,21,22,23 రౌండ్స్లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు దుబ్బాక ఫలితం టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ షాకింగ్కు గురిచేసింది. ప్రచారంలో మంత్రి హరీష్ రావు అన్నీ తానై వ్యవహరించినప్పటికీ.. ఓటర్లు రఘునందన్ వైపే మొగ్గుచూపారు.
దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు పోలు అవ్వగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ 62,773 ఓట్లతో విజయం సాధించగా.. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 61,302 ఓట్లు తెచ్చుకుని గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కేవలం 21,819 ఓట్లకే పరిమితం అయ్యారు.