ఎమ్మెల్సీ అభ్యర్థులకు గవర్నర్‌ ఆమోదం

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం మంత్రివర్గం ఎంపికచేసిన ముగ్గురి పేర్లను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ ఆదివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. గవర్నర్‌ కోటాలో ఖాళీఅయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రజాగాయకుడు గోరటి వెంకన్న, మాజీమంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్‌ పేర్లను ఖరారు చేసిన ప్రభుత్వం.. ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించింది. పరిశీలించిన తమిళిసై ఆమోదముద్ర వేశారు.