ప్రముఖ ప్రజా గాయకుడు, కళాకారుడు పైలం సంతోష్ (43) కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పైలం సంతోష్ అస్వస్థతకు గురికావడంతో నల్లగొండ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. కాగా, సంతోష్ స్వగ్రామం జిల్లాలోని కట్టంగూర్ మండలం దుగునెల్లి. సంతోష్ మృతదేహాన్ని సందర్శించి పలువురు నేతలు నివాళులర్పించారు.
