జీహెచ్ఎంసీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో పోలింగ్, దాని అనంతరం ప్రక్రియకు చేపట్టవలసిన చర్యలను ఎన్నికల సంఘం పూర్తిచేసింది. ఎన్నికలకు ముందు రోజు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి పంపిణీ, ఓటింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను భద్రపరచడం, ఓట్ల లెక్కింపునకు సర్కిళ్ల వారీగా 30 డీఆర్సీ (డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్) కేంద్రాలను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీలోని 6 జోన్లు, 27 సర్కిళ్ల పరిధిలోని విద్యాసంస్థలు, ఇండోర్ స్టేడియాలను ఇందుకోసం ఎంపికచేసింది. ఒక్కో కేంద్రంలో గరిష్ఠంగా 7, కనిష్ఠంగా 3 వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది.
