కామారెడ్డి సీఐ జగదీశ్ అక్రమాల వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. జగదీశ్ అక్రమాస్తులకు సంబంధించి వారం రోజులుగా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిజామాబాద్ కంఠేశ్వర్లోని యాక్సిస్ బ్యాంక్ లాకర్లో ఉన్న రూ.34 లక్షల నగదు, 9 లక్షల విలువ చేసే బంగారంతో పాటు ఇతర విలువైన ఆస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్స్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం నుంచే బెట్టింగ్ నిర్వాహకులతో కామారెడ్డి సీఐ జగదీశ్ టచ్లో ఉన్నట్లు ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.
ఇది ఇలా ఉండగా, సీఐ జగదీశ్కు బెట్టింగ్ వ్యవహారంలోనే కాకుండా ఓ వివాహిత హత్య కేసుతో, ఓ పెళ్లి సంబంధం విషయంలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐ జగదీశ్కు సంబంధించిన బాధితుల నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఐపీఎల్ క్రికెట్కు సంబంధించి బెట్టింగ్ నిర్వాహకుల నుంచి సీఐ జగదీశ్ తో పాటు జిల్లాకు చెందిన పలువురు సీఐలు, ఏఎస్సైలు పెద్ద ఏత్తున మాముళ్లు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇతర పోలీస్ అధికారుల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు.