వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేస్తున్న రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో మరింత ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రోడ్లను దిగ్బంధిస్తామని రైతు నేతలు హెచ్చరించారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారుపై ఉన్న టోల్ గేట్లను ఆక్రమిస్తామని, టోల్ ట్యాక్స్ వసూలు చేయకుండా అడ్డుకుంటామని భారతీయ కిసాన్ యూనియన్ (లఖోవాల్) ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ లఖోవాల్ తెలిపారు. ఈ నెల 5న దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
