ఎంపీ సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ, విదేశాల్లో జోరుగా కొనసాగుతుంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు ఇలా సమాజంలోని ప్రతీ వర్గానికి చెందినవారు ఈ ఛాలెంజ్లో పాల్గొంటూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. తాజాగా బాలీవుడ్ ఫిల్మిం యాక్టర్ జాకీష్రాఫ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మాట్లాడారు. ది కపిల్శర్మ కామెడీ షోకు జాకీష్రాఫ్ హాజరయ్యారు. ఈ షోలో యాంకర్ కపిల్శర్మ, అతని టీంకు జాకీష్రాఫ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. ఇప్పటి వరకు మనం ఐస్ బకెట్ ఛాలెంజ్, కీ కీ ఛాలెంజ్ వంటి ఎన్నో ఛాలెంజ్లు చూశాం. కానీ వీటన్నింటిలోకి ది బెస్ట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ప్రతీ ఒక్కరూ ఓ మొక్క నాటి సెల్ఫీ దిగి మరో ముగ్గురు స్నేహితులకు గ్రీన్ ఛాలెంజ్ విసరాల్సిందిగా కోరారు. వారిని సైతం ఇదే విధంగా చేసేలా కోరాలన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్కుమార్కు కృతజ్ఞతలు అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయిందని పేర్కొన్నారు.