ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ నియ‌మితుల‌య్యారు. ప్రస్తుత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్నీ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో.. ఆమె స్థానంలో ఆదిత్యనాథ్‌ దాస్‌ను ప్రభుత్వం నియమించింది. ఇక‌ పదవీ విరమణ చేయనున్న నీలం సాహ్నిని సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. నూతన సీఎస్‌గా నియమితులైన ఆదిత్యనాథ్‌ దాస్.. ఈ నెల 31న బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆదిత్యనాథ్‌ దాస్‌ను చీఫ్ సెక్రెట‌రీగా నియ‌మించ‌డంతోపాటు ప్ర‌భుత్వం ముగ్గురు ఐఏఎస్‌లకు కీలక బాధ్యతలు అప్పగించింది. జలవనరుల శాఖ కార్యదర్శిగా జే శ్యామలరావును, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా కె సునీతను, పురపాలక శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మిని నియమిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్ రిలీవైన తర్వాత జలవనరులశాఖ కార్యదర్శిగా జే శ్యామలరావు బాధ్యతలు చేపట్టనున్నారు.