ఏపీ హైకోర్టు సీజేగా ఏకే గోస్వామి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఏకే గోస్వామి నియామకమయ్యారు. కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన సిక్కిం హైకోర్టు జడ్జిగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నాయకత్వం వహించిన చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరిని సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. జస్టిస్‌ జేకే మహేశ్వరి గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల రద్దు మొదలుకుని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు అర్ధంతరంగా ఉద్వాసన పలకడం వరకు ఏపీ సీఎం జగన్‌ సర్కారు తీసుకున్న అనేక నిర్ణయాలను ఏపీ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ అవుతుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల ప్రారంభంలో కొలీజియం చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ గురువారం కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే కోల్‌కతా కోర్టులో పని చేస్తున్న జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిని ఏపీ హైకోర్టుకు బదిలీ చేశారు.