హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్‌ జగన్‌

పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ దత్తాత్రేయకు సీఎం జగన్ పుష్పగుచ్చం అందించి‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు.. దత్తాత్రేయను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డీజీపీని హిమాచల్‌ ప్రదేశ్‌ సంప్రదాయంతో గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సత్కరించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.