సీఎం కేసీఆర్‌ జన్మదినం.. హరిత పండుగ సంకల్పం

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు కానుకగా ఒకే రోజు.. ఒకే గంటలో కోటి మొక్కలను నాటేలా ‘కోటి వృక్షార్చన’ పేరిట హరిత పండుగను నిర్వహించ సంకల్పించింది. కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను శనివారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. మహమూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఆశయాన్ని ప్రతిబింబించేలా మొక్కలు నాటాలి : కేటీఆర్‌

తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న సీఎం కేసీఆర్‌ ఆశయాన్ని ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ ఈ నెల 17న మూడు మొక్కలు నాటాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడమే సీఎం కేసీఆర్‌కు మనమిచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు. కోటి వృక్షార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ జనరల్‌ సెక్రెటరీ, ఎంపీ సంతోష్‌కుమార్‌ను కేటీఆర్‌, మంత్రులు అభినందించారు. ప్రతీ గ్రామం యూనిట్‌గా సర్పంచ్ నేతృత్వంలో అన్ని చోట్లా ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలని, పంచాయతీరాజ్‌, అటవీశాఖలతో సమన్వయం ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆకాంక్షించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటి సంరక్షణ బాధ్యత కూడా ప్రతీ ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు.

కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి

ఆరేళ్ల హరితహారం ఫలితాలు ప్రస్తుతం కళ్ల ముందు కనిపిస్తున్నాయని, ఎంపీ సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కూడా పచ్చదనం పెంపులో అన్ని వర్గాలను జాగృతం చేస్తోందని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా చేపడుతున్న కోటి వృక్షార్చనలో అందరు పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్‌ కోరారు. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర మంత్రులు, నేతలకు కార్యక్రమం వివరాలు సంతోష్ కుమార్ ఫోన్ ద్వారా తెలిపి సహకారం కోరారు.

మొక్కలు నాటిన వారికి ‘వనమాలి’ బిరుదు ప్రదానం

సీఎం జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది. ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన ఫొటోలను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. యాప్‌ లింక్‌ కోసం 90003 65000 నంబర్‌కు జీఐసీ (GIC) అని మెసేజ్ చేయాలి. అప్పుడు యాప్‌ లింక్‌తో కూడిన మెసేజ్ వస్తుంది. అందరు మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫొటోలను అప్‌డేట్‌ చేయాలి. కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన ‘వనమాలి’ బిరుదు ఈ మెయిల్, మొబైల్‌కు వారం రోజుల్లో చేరుతుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్‌రెడ్డి, రాఘవ తెలిపారు.