తమిళనాడులోని విరుంద్నగర్ పటాకుల కర్మాగారంలో పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. విరుంద్నగర్ జిల్లాలోని అచ్చన్కులాం గ్రామంలో ఉన్న పటాకుల కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం 1.45 గంటలకు పేలుడు సంభవించింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 36 మంది గాయపడ్డారు. పటాకులను తయారు చేయడానికి కొన్ని రసాయనాలను కలుపుతుండగా ఈ పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం పళనిస్వామి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించగా, ముఖ్యమంత్రి పళనిస్వామి మృతులకు రూ.3 లక్షలు, క్షతగాత్రులకు రూ. లక్ష ఆర్థిక సహాయం ప్రకటించారు.