సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదును మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పార్టీ నాయకులంతా కలిసి ఐక్యంగా పనిచేసి సిద్దిపేట జిల్లాను సభ్యత్వ నమోదులో అగ్రభాగాన నిలపాలన్నారు. అభివృద్ధిలో జిల్లా నెంబరు వన్‌గా ఉందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో నాయకులు, కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట జన్మస్థానం అన్నారు. రాష్ట్ర ఉద్యమంలో జిల్లా ప్రజలు ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. పార్టీ నాయకత్వం ఆదేశానుసారం క్యాబినెట్‌ పోస్టుతో సహా ఎంతోమంది తమ పదవులకు రాజీనామాలు సమర్పించారన్నారు. ఇదే విధమైన స్ఫూరిని చూపుతూ పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ వి. రోజా శరం, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫక్రూద్దీన్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వి. సతీశ్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.