కోటి వృక్షార్చనకు కదులుదాం : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు

పుడమిని హరితవర్ణ శోభితం చేయాలనే మహాసంకల్పంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు అన్ని వర్గాల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ నిర్వహిస్తున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి ప్రజలందరూ అండగా ఉండాలని ప్రముఖ నటుడు మహేశ్‌బాబు పిలుపునిచ్చారు. ఆదివారం ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్‌చేశారు. ఇందులో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ గీతం నేపథ్యంలో మహేశ్‌బాబుతోపాటు ఆయన పిల్లలు గౌతమ్‌, సితార మొక్కలు నాటుతూ కనిపిస్తున్నారు. భూతాపాన్ని (గ్లోబల్‌ వార్మింగ్‌) తగ్గించాలంటే మొక్కలు నాటుతూ వాటిని పరిరక్షించడమే ఏకైక మార్గమని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు.