ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

విధి నిర్వహణలో ఉండి మద్యం సేవించిన ముగ్గురు కానిస్టేబుళ్లను నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌ చేశారు. నారాయణగూడ పీఏస్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు నాగరాజు, విశాల్‌, శివప్రసాద్‌ ఈ నెల 12న హైదర్‌గూడలోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద మద్యం సేవించారు. వారు మద్యం సేవించే దృశ్యాన్ని షాడో పోలీస్‌ టీమ్‌ సెల్‌ఫోన్‌లో వీడియో తీయగా అతడిపై దాడి చేసి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. దీంతో జవాన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా నైట్‌ డ్యూటీలో ఉన్న ఏఎస్సై ఠాకూర్‌ వారికి సర్దిచెప్పి జవాన్‌కు సెల్‌ఫోన్‌ ఇప్పించాడు. 24గంటల తరువాత ఎస్‌బీ ఇచ్చిన రిపోర్ట్‌ ఆధారంగా ముగ్గురు కానిస్టేబుళ్లను నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌ చేశారు.