తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు ‘వెంకటేశ్వర శర్మ’ మృతి ప‌ట్ల మంత్రి అల్లోల సంతాపం

తెలంగాణ అర్చక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ మృతి ప‌ట్ల దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. వెంక‌టేశ్వర శ‌ర్మ కుటుంబానికి అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని భ‌రోసానిచ్చారు. 

వెంక‌టేశ్వర శ‌ర్మ ప‌ద్మారావు న‌గ‌ర్ పోల్ బాల్ హ‌నుమాన్ దేవాలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్నారు. జ‌న‌వ‌రి 24న‌ గుజరాత్ రాష్ట్రంలోని  సోమనాథ ఆలయానికి వెళ్తుండగా దోల్కా జిల్లా  మోతి బోర్ వద్ద ఎదురుగా వస్తున్న వాటర్‌ ట్యాంకర్‌ను వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అడిక్‌మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస్‌, పాన్‌బజార్‌ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమణ అక్కడికక్కడే మరణించారు. ఈవో స‌త్యనారాయ‌ణ ఇటీవ‌లే మృతి చెంద‌గా.. అహ్మదాబాద్‌లోని హోప్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వెంక‌టేశ్వర శ‌ర్మ ఇవాళ తుదిశ్వాస విడిచారు.