కేసు నుంచి తప్పిస్తానంటూ లంచం డిమాండ్ చేసి ఎస్ఐ బెల్లన్న భాస్కర్‌రావు

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎస్ఆర్ నగర్ ఎస్ఐ

రెవెన్యూ అధికారులు జప్తుచేసిన వాహనాన్ని విడిపించేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బెల్లన్న భాస్కర్‌రావు సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. గతనెల 12న బల్కంపేట సమీపంలోని శ్రీరామ్‌నగర్‌ చౌకధరల దుకా ణం నంబర్‌ 728 నుంచి గోధుమలను అక్రమంగా తరలిస్తున్న ఆటోట్రాలీని పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకొని జప్తుచేశారు. డ్రైవర్‌పై కేసు నమోదుచేసి నిందితుడితోపాటు వాహనాన్ని ఎస్సార్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. ఆటోట్రాలీని తిరిగి ఇవ్వడంతోపాటు కేసు లేకుండా చేస్తానని వాహన యజమాని మహ్మ ద్‌ ఖాసిమ్‌ నుంచి ఎస్సై భాస్కర్‌రావు రూ.25 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఖాసిమ్‌ నుంచి ఎస్సై భాస్కర్‌రావు రూ.25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్‌ నేతృత్వంలో అధికారులు పట్టుకున్నారు. అనంతరం భాస్కర్‌రావును అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.