తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులు రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మరో 1,498 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో ఆరుగురు మృత్యువాతపడ్డారు. కొత్తగా 245 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇవాళ నమోదైన కేసులతో క్రియాశీల కేసులు 10వేలకు చేరువయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 9,993 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. 5,323 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. నిన్న ఒకే రోజు 62,350 కొవిడ్‌ శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,14,735, మరణాల సంఖ్య 1,729కి చేరాయి. ఇప్పటి వరకు 3,03,013 మంది కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 313 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నాయి.