తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవనామ సంవత్సరం సందర్భంగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సం వత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు చెబుతున్నాయని, తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందని సీఎం అన్నారు. కోటి ఎకరాలను మాగాణిగా చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రశంసలు అందుకుంటోందన్నారు. మండే వేసవిలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తోందన్నారు. రైతుల జీవితాల్లో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలను నింపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.