తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లౌక్డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్నినిర్వహించారు. ఈ సమీక్షలో ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎంవో కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, హైల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.