ఐపీఎస్‌ పదవికి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా

ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యంగా ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్‌- వీఆర్‌ఎస్‌) కోరుతూ సోమవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. 1995 బ్యాచ్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ ప్రస్తుతం అదనపు డీజీపీ హోదాలో సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఆరు సంవత్సరాల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన వీఆర్‌ఎస్‌ కోరడం హాట్‌ టాపిక్‌గా మారింది.

వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాసిన రెండు పేజీల లేఖను ప్రవీణ్‌ కుమార్‌ బహిర్గతం చేశారు. 26 ఏళ్ల పాటు పోలీస్‌ విభాగంలో పని చేశానని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ సందర్భంగా తన పదవీకాలానికి సంబంధించిన కొన్ని విషయాలను లేఖలో ప్రస్తావించారు. ప్రవీణ్‌ కుమార్‌పై ఇటీవల పలు ఆరోపణలు వచ్చాయి. ఆయన గురుకులాల కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. 

తొమ్మిది సంవత్సరాల నుంచి స్వేరోస్ కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్‌ సేవలు అందించారు. అనివార్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మెయిల్ పంపారు. ఈ నిర్ణయం బాధ కలిగించినా ఎట్టకేలకు ఎలాంటి పరిమితులు లేకుండా, తన మనసుకు నచ్చిన పనులు నచ్చిన రీతిలో చేయబోతున్నట్లు ప్రకటించారు. పదవీ విరమణ అనంతరం పీడిత వర్గాలకు అండగా ఉంటానని పేర్కొన్నారు.