‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో మొక్కలు నాటండి.. అభిమానులకు మెగాస్టార్‌ చిరంజీవి పిలుపు

మెగాస్టార్ చిరంజీవి తన జన్మదినం ఆగస్ట్‌ 22న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటాలని అభిమాలకు పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమన్నారు. అందుకు రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో మీరంతా పాల్గొనాలి.. మూడు మొక్కలు నాటి, ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

చిరు ట్వీట్‌పై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ మెగాస్టార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై మెగాస్టార్‌కు ఉన్న ప్రేమను తెలియజేస్తుందని, ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొనే ప్రతీ అభిమాని చిరుకు ట్యాగ్ చేయాలని సంతోష్ కుమార్ సూచించారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలిచిన మెగాస్టార్ ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు.