రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతుల మృతి

హైదరాబాద్‌లోని ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఎంపీటీసీ దంపతులు మృతిచెందారు. జిల్లాలోని తిప్పర్తి మండలం తానేదార్‌పల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు దొంతం కవిత తన భర్తతో వేణుగోపాల్‌ రెడ్డితో కలిసి హైదరాబాద్‌ వెళ్తున్నది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఉన్న యూ టర్న్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్‌ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. ఈక్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు టిప్పర్‌ వెనక నుంచి బలంగా గుద్దింది.

దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఎంపీటీసీ కవిత, ఆమె భర్త, టీఆర్‌ఎస్ పార్టీ నేత అయిన వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను కారులోనుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరు మృతి చెందడంతో అనిశెట్టి దుప్పలపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.