తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్

తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ నియ‌మించారు. ప్ర‌స్తుతం గోవ‌ర్ధ‌న్ నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి శాస‌న‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. త‌న‌ను ఆర్టీసీ చైర్మ‌న్‌గా నియమించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే గోవ‌ర్ధ‌న్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సిరికొండ మండ‌లం రావుట్ల‌లో జ‌న్మించిన గోవ‌ర్ధ‌న్‌.. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో కీల‌క నేత‌గా ఎదిగారు. టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున 2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన గోవ‌ర్ద‌న్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఆర్మూర్ నుంచి, 2004లో బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు గోవ‌ర్ధ‌న్‌. 1973లో పోలీస్ పటేల్‌గా పనిచేసి, 1981లో చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1986లో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1986లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ అయ్యారు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ఓడిపోయారు.