యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్

ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించు కున్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభం తో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.

ఆలయ ఈవో స్వామివారి ప్రసాదంను సీఎం కు అందజేశారు. బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం కేసీఆర్ పూజలు చేశారు. అర్చకులు సీఎం కెసీఆర్ కు  ఆశీర్వచనం అందజేశారు. అనంతరం.. దాదాపుగా పూర్తికావస్తున్న పనులను సీఎం పరిశీలించారు. ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలించారు.కళ్యాణ కట్ట , పుష్కరిణీ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు. సుదర్శన యాగం తలపెట్టిన యాగ స్థలాన్ని 75 ఎకరాల సువిశాల ప్రాంగణం లో నిర్వహించనున్న యాగశాల ఏర్పాట్లను పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు.

పుష్కరిణీ లో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలనూ సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మేల్యేలు సునీత మహేందర్ రెడ్డి,పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, మోత్కుపల్లి నర్సింహులు, జిల్లా కలెక్టర్ సత్యవతి తదితరులు సీఎం వెంట ఉన్నారు.