కాలుష్యంతో చదువుకోలేకపోతున్నాం: కె. సిద్ధార్థ విద్యార్థి లేఖ

  • విద్యార్థి లేఖనే వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు

పాఠశాల సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామంటూ ఓ విద్యార్థి రాసిన లేఖను హైకోర్టు వ్యాజ్యంగా స్వీకరించింది.  సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమచ్నూర్‌ మోడల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థి కె. సిద్ధార్థ ఈ లేఖ రాశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఆ పాఠశాలలో చదువుతున్న దాదాపు 600 మంది విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. విద్యాశాఖ, రెవెన్యూ, హోం, పరిశ్రమలు-వాణిజ్యశాఖల ముఖ్యకార్యదర్శులు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, సంగారెడ్డి కలెక్టర్‌, డీఈవోలకు నోటీసులు జారీచేసింది.