డెయిరీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సోమ భరత్‌కుమార్‌

తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా సోమ భరత్‌కుమార్‌ నియమితులయ్యారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్న భరత్‌కుమార్‌.. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

62 ఏండ్ల భరత్‌కుమార్‌ తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచీ సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగుతున్న భరత్‌కుమార్‌ న్యాయవాదిగా కూడా సేవలు అందిస్తున్నారు. పార్టీ కార్యకర్తల బీమా వ్యవహారాలను చూస్తున్నారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన భరత్‌ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోట. తెలంగాణ ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌ అప్పగించిన బాధ్యతలను కర్తవ్యదీక్షతో నిర్వర్తిస్తూ, పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. కార్పొరేషన్‌ చైర్మన్‌గా భరత్‌ను నియమించడం పట్ల ఉద్యమకారుడికి దక్కిన అరుదైన గౌరవంగా తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.