- పచ్చని పల్లెపై రసాయన పరిశ్రమల ముప్పేటదాడి
- గాలి, నీరు కలుషితం.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు
- నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఫార్మా కంపెనీలు
- బీబీ ‘నగరమంతా’ కాలుష్య పరిశ్రమలే
కాలుష్యానికి ఇన్నాళ్లు కేరాఫ్ అడ్రస్ ఏవి అంటే హైదరాబాద్లోని జీడిమెట్ల, పటాన్చెరువు, బాలనగర్ చెప్పుకునేవారు. ప్రస్తుతం ఆ జాబితాలోకి కొండమడుగు, బీబీనగర్ గ్రామాలు చేరాయి. రెండు దశాబ్దాల క్రితం స్వచ్ఛమైన గాలి, నీటితో సురక్షితమైన ప్రాంతంగా ఉన్న కొండమడుగు, బీబీనగర్ ఇప్పుడు కాలుష్యకాసారంగా మారాయి. పీల్చే గాలినుంచి, తాగే నీటి వరకు కలుషితమై కళ్లముందే కాలుష్యం కారుమబ్బులా కమ్ముకుంటోంది. భూగర్భజలాలు రంగు మారుతున్నాయి. ప్రజలు తెలియని దీర్ఘకాలిక రోగాలభారీన పడుతున్నారు.
హైదరాబాద్కు కూతవేటు దూరంలోని బీబీనగర్ మండలంలో గల రసాయన పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో బీబీనగర్, కొండమడుగు డేంజర్జోన్లుగా మారబోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భూగర్భజలాలు తాగేందుకే కాదు, ఉపయోగానికి కూడా ఏమాత్రం పనికి రాకుండా మారిపోతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. పడగ విప్పుతున్న కాలుష్యం నుంచి రక్షించాలని అనేకసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇక చేసేది లేక కొండమడుగు గ్రామస్థులు రాజకీయాలకతీతంగా పరిరక్షణ కమిటీగా ఏర్పడి రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని కోరుతూ చందక్ లేబోరేటరీ రసాయన పరిశ్రమ ఎదుట 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
అడుగడుగునా ఉల్లంఘనలు
రసాయన పరిశ్రమలపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. రసాయనాలను శుద్ధి చేయకుండానే వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వదులుతున్నారు. చీకటి సమయాల్లో ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నాయి. బోరు బావుల ద్వారా రసాయన వ్యర్థాలను భూగర్భంలోకి వదులుతున్నారు. దీంతో భూగర్భజలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. వర్షాలు పడినప్పుడల్లా వర్షపు నీటితోపాటు రసాయనాలను బహిరంగ ప్రదేశాల్లోకి వదులుతున్నారు. దీంతో పరిసరాల్లో దుర్వాసన వెలువడుతున్నాయి. పచ్చదనం వాడిపోయి గడ్డికూడా మొలవని పరిస్థితి నెలకొన్నది. రాత్రి పగలు తేడా లేకుండా కెమికల్ కంపెనీలు వదులుతున్న రసాయనాలు గాలిని కలుషితంచేస్తున్నాయి. సరైన అనుమతులు పొందకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులు ఒక్కటైతే ఇక్కడ మరో రకమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ నుంచి పరిశ్రమలకు సరైన అనుమతులు కూడా లేవని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రోగాల భారీన ప్రజలు
రసాయన పరిశ్రమలు విడుదల చేస్తున్న వాయువులతో గాలి కలుషితమవుతోంది. నల్లని మేఘాల్లా అవి ఆవహించి, ప్రజలకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్వచ్ఛమైన గాలి దొరక్క ఘాటైన రసాయనాలతో కలిసిపోయిన గాలినే పీల్చుకోవాల్సి వస్తోంది. దీని కారణంగా విపరీతమైన తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, కళ్లమంట, శ్వాసకోస సమస్యలకు గురవుతున్నారు. భూగర్భజలాలు కలుషితంకావడంతో ఎక్కడ బోరువేసినా రంగు మారిన నీళ్లే దర్శనమిస్తున్నాయి. ఇక్కడి బోర్లనుంచి సేకరించిన నీటిని పరీక్షలు చేయగా, భూగర్భజలాల్లో ఆరోగ్యానికి హానిచేసే ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం
కాలుష్య నియంత్రణ మండలికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. స్థానికులు కంపెనీల ఎదుట ధర్నా చేపట్టి చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు అందజేసినా ఆశించినస్థాయిలో చర్యలు తీసుకోలేదనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. పదేపదే ఫిర్యాదులతో స్పందిస్తున్న పీసీబీ అధికారులు యాజమాన్యాలతో కుమ్మక్కై వారికి అనుకూలంగా నివేదికలు సమర్పిస్తున్నారని, అంతేకాకుండా తమకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని చర్యలు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇక్కడి ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.
రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని రిలే నిరాహార దీక్షలు
బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామస్తులు కొండమడుగు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకొని రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలని ఆందోళన బాట పట్టారు. కొండమడుగు మెట్టు వద్ద చందక్ లేబోరేటరీ కెమికల్ కంపెనీ ఎదుట 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. గ్రామస్థులు చేపట్టిన పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతుంది. ఈ నెల 9వ తేదీన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రిలే నిరాహార దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా రసాయన కంపెనీల యాజమాన్యాలకు స్వయంగా ఫోన్చేసి కంపెనీలను జనావాసాలనుంచి పూర్తిగా ఎత్తివేయాలని, లేదంటే తానే వేలాదిమందితో కదిలివచ్చి ఆ పని చేయాల్సి ఉంటుందని హెచ్చరించా రు. మరుసటిరోజు బీజేపీ జిల్లా నేత పొట్టోళ్ల శ్యాంగౌడ్, స్థానిక మండల నాయకులతో కలిసి దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి దీక్షా శిబిరంలో పాల్గొని కెమికల్ కంపెనీలు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
ఫార్మా కంపెనీలను ఎత్తివేయాలి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ప్రజల ఆరోగ్యాలతో చలగాటమాడుతున్న ఫార్మా కంపెనీలను జనావాసాలనుంచి పూర్తిగా ఎత్తివేయాలి. ఇప్పటికే పరిశ్రమలు వదులుతున్న భూగర్భజలాలు, గాలి పూర్తిగా కలుషితమై ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొండమడుగు ప్రజల పోరాటంలో భాగస్వామినవుతా. తక్షణమే రసాయన పరిశ్రమలు ఎత్తివేయాలి. లేదంటే నేనే వేలాది మందితో వచ్చి ఆ పనిచేస్తా.
రసాయన పరిశ్రమలపై చర్యలు : ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ప్రజలకు హాని కలిగించే చర్యలకు పాల్పడుతున్న రసాయన పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే కొండమడుగు గ్రామస్థులు చేపట్టిన ఆందోళనలను పరిగణలోకి తీసుకొని పీసీబీ అధికారులతో చర్చించాం. పరిస్థితిని సమీక్షించి ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా రసాయన కంపెనీలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. రెండు మూడు రోజుల్లో మూసివేతకు ఆదేశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
(సోర్స్: ఆంధ్రజ్యోతి)