పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌

తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, సర్దార్‌ రవీందర్‌సింగ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రెం డేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్‌కు చెందిన రవీందర్‌సింగ్‌ గతంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి, సీఎం కేసీఆర్‌ ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందారు.

1995లో కరీంనగర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా తొలి విజయం సాధించిన ఆయన 27 ఏండ్లుగా కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. 2014లో జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌గా బాధ్యతలు చేపట్టి దక్షిణ భారత్‌లో మొట్టమొదటి సికు సామాజిక వర్గానికి చెందిన మే యర్‌గా గుర్తింపు పొందారు. రూపాయికే నల్లా కనెక్షన్‌, రూపాయికే దహన సంస్కారాలు వంటి వినూత్న పథకాలను ప్రారంభించి పేరు పొందారు.

ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు పెళ్లిరోజే రవీందర్‌సింగ్‌కు పదవి రావడంపై అభిమానులు అనందం వ్య క్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ తనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తానని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కేసీఆర్‌ వెంటే ఉండి రుణం తీర్చుకుంటామని రవీందర్‌సింగ్‌ ప్రకటించారు. సీఎం, పార్టీ అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు జిల్లా మంత్రులు, నాయకులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.