ప్రధాని మోదీకి మాతృవియోగం.. హీరాబెన్‌ కన్నుమూత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే వందో పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అహ్మదాబాద్‌లోని యూఎన్‌ మెహతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ.. హుటాహుటిన ఢిల్లీ నుంచి గుజరాత్‌ చేరుకున్నారు.

తల్లి మరణంపై ప్రధాని మోదీ భావోద్వేగంతో ట్వీట్‌ చేశారు. ‘నిండు నూరేండ్లు పూర్తిచేసుకుని ఈశ్వరుని చెంతకు చేరింది. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది’ అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాగా, హీరాబెన్‌ రెండు రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. దీంతో యూఎన్‌ మెహతా దవాఖానకు ఆమెను తరలించారు. ప్రధాని మోదీ గంటన్నరకు పైగా దవాఖానలోనే గడిపారు. తల్లి ఆరోగ్యం గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆరోగ్యం నిలకడగానే ఉందని హాస్పిటల్‌ వర్గాలు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే హీరాబెన్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లారు.