సమాచార హక్కు చట్టం కమిషన్లో 7,923 కేసులు పెండింగులో ఉన్నాయని కమిషన్ తెలిపింది. కమిషన్లో ఇప్పటి వరకు విధులు నిర్వర్తించిన కమిషనర్ల జిల్లా పర్యటనలు, పెండింగు కేసుల వివరాలు తెలుపాలని ఆర్టీఐ కార్యకర్త రాజేంద్ర దరఖాస్తు చేయగా కమిషన్ సమాధానం ఇచ్చింది. గతనెల 28 నాటికి 7,923 కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపింది. అలాగే సమాచార కమిషనర్లుగా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన బుద్ధా మురళి, కట్టా శేఖర్రెడ్డి, సయ్యద్ ఖలీలుల్లా, మైద నారాయణరెడ్డి, డాక్టర్ మొహమ్మద్ అమీర్ తమ పదవీకాలంలో ఒక్క జిల్లా పర్యటన చేయలేదని, జిల్లాల్లో జరిగిన ఆర్టీఐ సమావేశాల్లో పాల్గొనలేదని కమిషన్ తెలిపింది. గుగులోతు శంకర్నాయక్ ఒక్కరే ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో నిర్వహించిన నాలుగు ఆర్టీఐ సమావేశాల్లో పాల్గొన్నారని కమిషన్ తెలియజేసింది.