ఇది రాజ‌కీయ స‌భ కానేకాదు.. పోరాట స‌భ : కేసీఆర్

చ‌లో న‌ల్ల‌గొండ స‌భ రాజ‌కీయ స‌భ కానేకాదు.. ఉద్య‌మ స‌భ‌, పోరాట స‌భ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా కోసం ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఒక్క పిలుపుతో పులులాగా క‌దిలివ‌చ్చిన అన్నాచెల్లెల్లు, అక్కాత‌మ్ముళ్ల‌కు ఉద్య‌మాభివ‌నంద‌నాలు. ఇవాళ న‌ల్ల‌గొండ‌లో చ‌లో న‌ల్ల‌గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కార‌ణం ఏందంటే.. ఎందుకు మ‌నం ఈ స‌భ పెట్టాల్సి వ‌చ్చింది. నాకు కాలు విరిగిపోయినా కుంటి న‌డ‌క‌తోనే, క‌ట్టె ప‌ట్టుకోని ఇంత ఆయాసంతో ఎందుకు రావాల్సి వ‌చ్చింది. ఈ విష‌యం ద‌య‌చేసి అంద‌రూ ఆలోచించాలి అని కేసీఆర్ కోరారు.

కొంద‌రికి ఇది రాజ‌కీయం. మ‌నం పెట్టింది ఉద్య‌మ స‌భ‌, పోరాట స‌భ‌, రాజ‌కీయ స‌భ కానే కాదు. కృష్ణా న‌దిలో మ‌న జ‌లాలు, నీళ్ల మీద మ‌న హ‌క్కు అనేది మ‌నంద‌రి బ‌తుకుల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. చావో రేవో తేల్చే స‌మ‌స్య‌. ఈ మాట 24 ఏండ్ల నుంచి ప‌క్షిలాగా తిరుగుకుంటూ మొత్తం రాష్ట్రానికి చెబుతున్నా. ఇటు కృష్ణా కావొచ్చు. అటు గోదావ‌రి కావొచ్చు. నీళ్లు లేక‌పోతే మ‌న‌కు బ‌తుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా స‌రిగా లేక‌పోతే బతుకులు వంగిపోయాయి ఈ న‌ల్ల‌గొండ‌లో. ల‌క్షా 50 వేల మంది మునుగోడు, దేవ‌ర‌కొండతో పాటు ఇత‌ర ప్రాంతాల బిడ్డ‌ల‌ న‌డుము వంగిపోయాయి. చివ‌ర‌కు ఈ జిల్లాలో ఉద్య‌మ‌కారులంద‌రూ క‌లిసి ఫ్లోరైడ్ బారిన‌ప‌డ్డ‌ బిడ్డ‌ల‌ను తీసుకుపోయి ప్ర‌ధాన‌మంత్రి టేబుల్ మీద పండ‌వెడితే అయ్యా మా బ‌తుకు ఇది అంటే కూడా ప‌ట్టించుకోలేదు. ఆనాడు పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేరా. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఫ్లోరైడ్ ర‌హితంగా త‌యారు చేశాం. ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా చెబుతున్నారు. భ‌గీర‌థ నీళ్లు వ‌చ్చాక ఆ బాధ‌లు పోయాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌ని కేసీఆర్ తెలిపారు.

నీళ్లు దొబ్బి పోదామ‌నుకునే స్వార్థ శ‌క్తుల‌కు హెచ్చ‌రిక ఈ చ‌లో న‌ల్ల‌గొండ స‌భ : కేసీఆర్

కృష్ణా న‌దిలో మ‌న వాటాకు వ‌చ్చే నీళ్ల‌ను దొబ్బి పోదామ‌నుకునే స్వార్థ శ‌క్తుల‌కు హెచ్చ‌రిక ఈ చ‌లో న‌ల్ల‌గొండ స‌భ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. న‌ల్ల‌గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కొంత మంది స‌న్నాసులు తెలివి లేక వాళ్ల‌కు వ్య‌తిరేకం అనుకుంటున్నారు ఈ స‌భ‌. ఉవ్వెత్తున మ‌నం ఉద్య‌మం లాగా ఎగిసిప‌డ‌క‌పోతే మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోతే ఎవ‌రూ కూడా మ‌న ర‌క్ష‌ణ‌కు రాడు. మీరు ఈ మాట గుండెల్లో రాసిపెట్టుకోండి. ఫ్లోరైడ్ నాడు ఎవ‌డూ రాలేడు. ఓట్లు ఉన్న‌ప్పుడు నంగ‌నాచి క‌బుర్లు చెబుతారు. కానీ త‌ర్వాత ఎవ‌రూ రాడు. ఓటు గుద్దిన‌క గ‌డ్డ‌కెక్కిరంటే మ‌న వీపుల గుద్ది బొంద‌ల నూకుతుండ్రు త‌ప్ప ఎవ‌రూ రాలేదు. ఇది జ‌రిగిన చ‌రిత్ర‌. ఇప్పుడు జ‌రుగుతున్న చ‌రిత్ర‌.. ద‌య‌చేసి మీరు గ‌మ‌నించాలి. ఇది ఆషామాషీ కాదు. ఇది చిల్ల‌ర‌మ‌ల్ల‌ర రాజ‌కీయ స‌భ కాదు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి కాదు, రాష్ట్ర నాయ‌కుల‌కు కాదు.. ఇవాళ నీళ్లు పంచ‌డానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్‌కు కానీ, కేంద్ర ప్ర‌భుత్వానికి గానీ, కేంద్ర నీటిపారుద‌ల మంత్రికి గానీ, మ‌న నీటిని దొబ్బి పోదామనుకునే స్వార్థ శ‌క్తుల‌కు గానీ ఒక హెచ్చ‌రిక ఈ చ‌లో న‌ల్ల‌గొండ స‌భ‌. ఏ ఒక్క‌రికో, ఓ వ్య‌క్తికో, కొద్ది మంది, పిడికెడు మంది గురించో స‌భ కాదు. ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్ర‌జ‌ల యొక్క జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది చూసిన త‌ర్వాత చాలా బాధ‌ప‌డ్డాం అని కేసీఆర్ తెలిపారు.

నేనేం త‌క్కువ చేయ‌లేదు..
మీ అంద‌రి ఆశీస్సుల‌తో ఉద్య‌మాన్ని విజ‌యంవంతం చేశాం. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీ అంద‌రి దీవేన‌తో ప‌ది ఏండ్లు ఈ గ‌డ్డ‌ను పారిపాల‌న చేశాను. నేనేం త‌క్కువ చేయ‌లేదు. ఎక్క‌డో పోయిన క‌రెంట్‌ను తెచ్చి నిమిషం పాటు క‌రెంట్ పోకుండా స‌ప్ల‌యి చేయించినం. ప్ర‌తి ఇంట్లో న‌ల్లా పెట్టి మంచినీళ్లు ఇచ్చాం. ఒక‌నాడు ఆముదాలు మాత్ర‌మే పండిన న‌ల్ల‌గొండ‌లో, బ‌త్తాయి తోట‌ల‌తో బ‌తికిన న‌ల్ల‌గొండ‌లో ల‌క్ష‌ల ల‌క్ష‌ల ట‌న్నుల వ‌రిధాన్యం పండించే ప‌రిస్థితులు తెచ్చుకున్నాం. అంత‌కుముందు లేని నీళ్లు యెడికెళ్లి వ‌చ్చిన‌య్ అంటే ద‌మ్ము కావాలి.. చేసే ఆరాటం ఉండాలి. ఇది నా ప్రాంతం నా గ‌డ్డ‌, నా ప్ర‌జ‌లు అనే ఆరాటం ఉంటే ఎట్లైనా సాధించి రావొచ్చు అని కేసీఆర్ పేర్కొన్నారు.

మీకేం కోపం వచ్చిందో.. ఏ భ్రమల పడ్డరో.. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నరు : కేసీఆర్‌
పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. నల్లగొండ బహిరంగ సభలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ నాడు రాష్ట్రం కోసం కొట్లాడినం. ఆ నాడు జలసాధన ఉద్యమంలో మండలానికో బ్రిగేడియర్‌ వచ్చి నెలపదిహేను రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేశాం. ఆ రోజు నేనే రాసిన పాట. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపోయె’ అని. ఆ రోజు ఏడ్చినం. ఈ రోజు గోదావరి, కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నాం. బోనగిరి దగ్గర బస్వాపూర్‌ ప్రాజెక్టు కంప్లీట్‌ అయ్యింది. డిండి ప్రాజెక్టు పూర్తి కాబోతున్నది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోర్లు తెరుచుకొని చూస్తున్నరు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతల అయితే పాలమూరుతో పాటు వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్నరు ఎప్పుడు నీళ్లు వస్తయని’ అన్నారు.

అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండన్నది..
‘ఎవరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకులు వందలకొద్ది కేసులు వేసినా పదేళ్లు పంటిబిగువున కొట్లాడుతూ.. కేంద్రం పోరాటం చేస్తూ ముందుకు తీసుకుపోయాం. ఆనాడు ఉన్న కాంగ్రెస్‌ గవర్నమెంట్‌, తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్‌ ఆ రోజు ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి.. ఆ తర్వాత ఎవరి వాటా వారికి వస్తుందని చెప్పింది. ఆ నాడు బిల్లు పాస్‌ కావాలి.. తెలంగాణ రావాలి.. ఇదో ఆటంకం కాకూడదని.. సరే కానివ్వండి తర్వాత చూసుకుందామని చెప్పాం. ఆ తర్వాత ఢిల్లీలో మోదీ ప్రభుత్వం వచ్చింది. వాళ్లకు వందల ఉత్తరాలు రాసినం. అయ్యా మునిగిందే మేం నీళ్లల్లో.. నాశనం అయ్యాం.. మా బతుకులు ఆగమైపోయినయ్‌.. వెంటనే నీళ్ల పంపిణీ చేయండి.. ట్రిబ్యునల్‌ వేయాలని అడితే వేయలేదు. వేయకపోతే సుప్రీంకోర్టుకుపోయాం. సుప్రీంకోర్టుకుపోయి తగాదా పెట్టాం. ఆ తర్వాత కూడా వేయలేదు. ఒక రోజు మీటింగ్‌ జరిగితే.. గట్టిగా నిలదీస్తే కేసు వాపస్‌ తీసుకుంటే ట్రిబ్యునల్‌ వేస్తామని చెప్పారు. సరేనని కేసు విత్‌డ్రా చేసుకున్నాం. ఆ తదనంతరం ట్రిబ్యునల్‌ త్వరగా వేయలేదు. వంద ఉత్తరాలు నేను రాసిన’ అంటూ గుర్తు చేశారు.

మొగోడు చేయాల్సిన పనేంది..?
‘లోక్‌సభను స్తంభింపజేసినం. ఎంపీలకు మీరు ఏమైనా మంచిదే కొట్లాడాలని చెబితే.. వారం రోజులు లోక్‌సభ జరుగనివ్వలేదు. అట్ల కొట్లాడినం. ఆ ఒత్తిడికి తలొగ్గి.. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు ట్రిబ్యునల్‌కు వేశారు. ఇప్పుడు జరగాల్సిందే ఏంటీ ? ఏ గవర్నమెంట్‌ ఉన్నా.. మా గవర్నమెంటే ఉండి ఉన్నా ఏం చేయాలి..? ట్రిబ్యునల్‌ ముందు గట్టిగా వాదించి.. చరిత్ర మొత్తం చెప్పి.. మన అవసరాలు, కరువు చెప్పి, బాధలు చెప్పి.. మన వాటా ఇంత రావాలని కొట్లాడాలే. అది మొగోడు చేయాల్సిన పని. ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో.. ఏం భ్రమలో పడ్డరో.. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నరు. ఆ తర్వాత ఏం నడుస్తుందో మూడో నెల మీరే కళ్లారా చూస్తున్నరు. చిన్న చిన్న విషయాలు ఫర్వాలేదు. మన జీవితాలను దెబ్బకొట్టేటటువంటి కృష్ణా జలాలు కేఆర్‌ఎంబీ భద్రప్పల్లాగా పోయి గర్నమెంట్‌ అప్పగించింది’ అంటూ కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

ఎన్ని గుండెల్రా మీకు..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వ‌రా..? : కేసీఆర్
చ‌లో న‌ల్ల‌గొండ స‌భ‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ స‌ర్కార్‌పై నిప్పులు చెరిగారు. రైతుల‌ను చెప్పుతో కొడుతావా..? తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వ‌రా..? ఎన్ని గుండెల్రా మీకు అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. చ‌లో న‌ల్ల‌గొండ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ రాష్ట్రానికి మేం చేసిన కాడికి చేశాం. ఫ‌లితం చూశాం. ఒక‌నాడు ఏడ్సిన తెలంగాణ‌.. నేడు మూడు కోట్ల ట‌న్నుల వ‌డ్లు పండించింది. రైతుబంధు ఇవ్వ‌డానికి కూడా చేత‌నైత‌ లేదు. ఇంత ద‌ద్ద‌మ్మ‌లా..? రైతుబందు కూడా ఇవ్వ‌రా..? అన్న‌దాత‌ల‌ను ప‌ట్టుకుని రైతుబంధు అడిగినోన్ని చెప్పుతో కొట్ట‌మంటావా..? ఎన్ని గుండెల్రా మీకు..? ఎట్ల మాట్లాడుతారు.. కండ‌కావ‌ర‌మా..? కండ్లు నెత్తికి వ‌చ్చినాయా..? ప్ర‌జ‌ల‌ను అలా అనొచ్చా..? ఒక్క మాట చెబుతున్నా జాగ్ర‌త్త‌.. నోటి ద‌రుసుతో మాట్లాడేటోళ్ల‌రా… చెప్పులు పంట‌లు పండించే రైతుల‌కు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్ల ఉంట‌యి.. బందోబ‌స్తుగా ఉంటాయి.. గ‌ట్టిగా ఉంట‌యి.. ఒక్క‌టే చెప్పు దెబ్బ‌తో మూడు ప‌ళ్లు ఊసిపోతాయి. దానికోస‌మేనా మీరు అడిగేది. ఇది మ‌ర్యాద‌నా.. గౌర‌వ‌మా..? ప్ర‌జ‌ల‌ను గౌర‌వించే ప‌ద్ధ‌తా..? చేత‌కాక‌పోతే జ‌ర త‌ర్వాత ఇస్తా.. లేదంటే మాకు చేయొస్తే లేదు అని చెప్పాలి. కానీ అడిగినోని చెప్పుతో కొట్టాలి అని అంటారా..? అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వ‌రా..? ఏం చేస్త‌రు చంపేస్తారా..?
కేసీఆర్ చ‌లో న‌ల్ల‌గొండ అంటే కేసీఆర్‌ను తిరగ‌నివ్వం అని అంట‌రు. ఇంత మొగోళ్లా..? కేసీఆర్‌ను తిరగ‌నివ్వ‌రంట‌.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వ‌రా..? ఏం చేస్త‌రు చంపేస్త‌రా..? దా.? చంపుతావా ఏపాటి చంపుతావో దా..? కేసీఆర్‌ను చంపి మీరు ఉంటారా.. ఇది ప‌ద్ద‌తా.. ప్ర‌తిప‌క్ష పార్టీ త‌ప్ప‌కుండా ప్ర‌జ‌ల త‌ర‌పున వ‌స్త‌ది. ప్ర‌జ‌ల మ‌ధ్య అడుగుత‌ది. మీకు ద‌మ్ముంటే మేం చేసిన దానికంటే మంచిగా చేసి చూపియ్. క‌రెంట్ మంచిగా ఇచ్చి చూపియ్.. ఆగ‌మాగం కావొద్దు. పాల‌మూరు ఎత్తిపోత‌ల పూర్తి చేయాలి. దాని గురించి మాట‌లేదు. ఖ‌మ్మంలో సీతారామ పూర్తి చేయాలి. దాని గురించి ముచ్చ‌ట లేదు. గురుకులాలు ఎక్కువ పెట్టాలి.. ఆ ముచ్చ‌ట‌ లేదు. క‌రెంట్ మంచిగా ఇవ్వాలి.. ఆ ముచ్చ‌ట లేదు. ఇవన్నీ మాయం చేసి బ‌లాదూర్‌గా తిరుగుదాం అనుకుంటున్నారా..? తిర‌గ‌నివ్వం జాగ్ర‌త్త అని చెబుతున్నాం. త‌ప్ప‌క నిల‌దీస్తాం. ఎండ‌గ‌డుతాం అని కేసీఆర్ హెచ్చ‌రించారు.