తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య పున‌ర్విభ‌జ‌న అంశాలపై ఫోక‌స్‌.. నివేదిక సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం

జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య అప‌రిష్కృతంగా ఉన్న పునర్విభజన అంశాలపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీ, త‌దిత‌ర‌ పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. తొమ్మిదో షెడ్యూల్‌, ప‌దో షెడ్యూల్ ప‌రిధిలో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్‌ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. పదేండ్లు పూర్తవనుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్‌లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని ఆదేశించారు.

ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలను చర్చించనున్నారు. వీటితో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించనున్నారు.

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. బుధవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.