అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు : నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి

అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని పేరొన్నారు. ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక తెచ్చేవారు అనుమతి పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.

కొంత మంది దళారులు, మధ్యవర్తులు ఎక్కువ సిమ్‌ కార్డులు కొని ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని అత్యవసరమైన వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకను ఆన్‌లైన్‌లో ఎవరి పేరు మీద బుక్‌ చేసుకుంటే అక్కడే సరఫరా చేయాలని ఆదేశించారు. ఇసుక ట్రాక్టర్లను రోడ్లపై ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి వారిపై ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయబడుతాయని తెలిపారు.