కార్యాలయంలో మిర్యాలగూడ మున్సిపల్‌ కమిషనర్‌ గాఢ నిద్ర..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్‌ కమిషనర్‌ యూసుఫ్‌అలీ కార్యాలయ సమయంలో నిద్రపోవడంపై సమాచార హక్కు చట్టం సలహా సహాయ సమితి, సాధన సమితి ప్రతినిధులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సరికొండ రుషికేశ్వర్‌రాజు మాట్లాడుతూ, మున్సిపల్‌ కమిషనర్‌ గురువారం టేబుల్‌పై కాళ్లు చాపి నిద్రిస్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో రావడం దురదృష్టకరమన్నారు.

కలెక్టర్‌, సీడీఎంఏ కమిషనర్‌ ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని కమిషనర్‌ను విధులనుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడ సమాచార హక్కు చట్టం సాధనసమితి ప్రతినిధులు చిలుముల కొండల్‌, కార్తీక్‌రాజు, మచ్చ మధుకర్‌, మందశేఖర్‌, గణేశ్‌, అజయ్‌ ఉన్నారు.