ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు సచివాలయంలో  గురువారం సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు చేపట్టారు. సెక్రటేరియట్‌లోని మొదటి బ్లాక్‌ ఛాంబర్‌లో  కుల దైవమైన వేంకటేశ్వరస్వామికి పూజలు చేశారు.  అనంతరం బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, బోండ ఉమ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్‌ అండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం, పెన్షన్లు రూ. 4 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పై నాలుగో సంతకం, స్కిల్‌ సెన్సెస్‌పై ఐదో సంతకం చేశారు.

గురువారం తిరుమలలో వేంకట్వేరస్వామని, విజయవాడలో ఇంద్రకీలాద్రి దుర్గదేవిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అమరావతి మీదుగా సెక్రటేరియట్‌కు బయలు దేరిన చంద్రబాబుకు అమరావతి రాజధాని రైతులు అడుగడుగునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. సెక్రటేరియట్‌కు చేరుకున్న చంద్రబాబుకు ఏపీ చీఫ్‌ సెక్రటరి నీరబ్‌ కుమార్‌ స్వాగతం పలికారు.