చట్టవిరుద్ధంగా పోడు భూమిని సాగుచేస్తే కఠిన చర్యలు : మంత్రి కొండా సురేఖ

వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను సాగుచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, వారి ఉపాధికి భంగం కలుగకుండా, అటవీశాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ అధికారులు పోడు భూముల రక్షణకు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. అదే సమయంలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాలు సున్నిత పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, ఆపై క్రమశిక్షణ చర్యలకు గురికావద్దని హెచ్చరిక చేశారు.

శనివారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్, అడిషనల్ సెక్రెటరీ ప్రశాంతి, డిప్యూటీ సెక్రెటరీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోడు రైతుల హక్కులను కాపాడటంలోనూ, అదే సమయంలో అటవీశాఖ భూములను కాపాడే అధికారులకు రక్షణ కల్పించడంలోనూ ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతున్నదని మంత్రి సురేఖ తెలిపారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఏళ్లుగా పోడు భూములను సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, వ్యవసాయం పేరుతో మార్గదర్శకాలకు, చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు చేపట్టాల్సి వస్తుందని మంత్రి హెచ్చరించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్ఆర్ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లపై గిరిజనులు చేసిన దాడిని ఆమె ప్రస్తావించారు. ప్రజల ప్రయోజనాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో.. రాష్ట్ర అటవీ సంపద, సహజ వనరుల పరిరక్షణకు అంతే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.