ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. వివాదస్పదులుగా ఉన్న వారిని జీఏడీకి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవను, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ను జీఏడీ(GAD) కి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్‌ను , పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్‌ను నియమించింది. పురపాలక శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్‌ జైన్‌, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది.

పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్‌, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌గా కాటమనేని భాస్కర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న, ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు, ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం. జానకి, పశు సంవర్ధకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం నాయక్‌ను నియమించింది.

తిరుపతి కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను గనులశాఖ కమిషనర్‌, డైరెక్టర్‌గా, ఏపీ ఎండీసీ ఎండీగా ప్రవీణ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారికి జిల్లాకలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.