బడ్జెట్‌లో తెలంగాణ పదాన్ని తొలగించారు.. ఈ అన్యాయానికి కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలి.. : సీఎం రేవంత్‌ రెడ్డి

వికసిత్ భారత్ 2047 బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాను స్వయంగా ప్రధానిని మూడుసార్లు కలిసి తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరానన్నారు. వివక్ష లేని, వివాదాలు లేని సత్సంబంధాలు ఉండాలని, అభివృద్ధికి సహకరించాలని కోరామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానికి చెప్పామని.. వివక్షను తొలగించి నిధులు కేటాయించాలని కోరామని గుర్తు చేశారు. మొత్తం బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్ని తొలగించారని ఆరోపించారు. తెలంగాణ అనే పదాన్ని పలకడానికే కేంద్రం ఇష్టపడడం లేదని.. వారి మనసులో ఇంత కక్ష ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదన్నారు. పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఏపీకి కేంద్రం నిధులు కేటాయించిందని.. మరి పునర్విభజనచట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఎందుకు కేటాయించలేదు? అని ప్రశ్నించారు.

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి, రీజనల్ రింగ్ రోడ్డుకు.. ఏ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించలేదన్నారు. ఐటీఐఆర్ గురించి ప్రస్తావించలేదని.. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అనేది బోగస్ నినాదంగా మార్చారన్నారు. వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని భావిస్తున్నారన్నారు. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని విమర్శించారు. బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని.. ఇంతటి వివక్ష, కక్షపూరిత వైఖరి ఎప్పుడూ చూడలేదన్నారు. బీజేపీకి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు మాత్రమే కావాలని.. కానీ అభివృద్ధి పట్టదా? అంటూ ప్రశ్నించారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్ రెడ్డి, బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి రాజీనామా చేసి బయటకు రావాలన్నారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వం అని కేంద్రం చెప్పినా కిషన్ రెడ్డి ఎందుకు మంత్రివర్గంలో కొనసాగాలి? అంటూ ప్రశ్నించారు. ప్రధానిని మేం పెద్దన్నగా భావిస్తే… ఆయన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు.

కేవలం క్విడ్ ప్రో కో విధానంలో కుర్చీ కాపాడుకునేందుకే ప్రధాని బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ నిరసన తెలుపుతుందన్నారు. విభజన చట్టం కేవలం ఏపీకి మాత్రమే కాదు.. తెలంగాణకు వర్తిస్తుందన్నారు. బడ్జెట్‌ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట్‌ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లేనన్నారు. కిషన్ రెడ్డి మౌనం.. బానిస మనస్తత్వంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొద్దన్నారు. పోలవరానికి నిధులు ఇచ్చినప్పుడు.. తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతలకు ఎందుకు నిధులు ఇవ్వరో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంట్‌లో నిరసనకు బీజేపీ ఎంపీలూ కలిసి రావాలన్నారు. తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందని.. ఇది ఇలాగే కొనసాగితే మరో ఉద్యమం తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.